రక్షణ న్యూస్, బాపట్ల
బాపట్ల జిల్లా కేంద్రంలో ఈ నెల 26న నిర్వహించనున్న 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను కొత్తదనంతో ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ ఐ.ఏ.ఎస్. అధికారులను ఆదేశించారు. పోలీస్ పెరేడ్ మైదానంలో ఉదయం 9 గంటలకు జాతీయ పతాక ఆవిష్కరణ జరగనుండగా, పరేడ్, వేదిక అలంకరణకు సంబంధించి పోలీస్, మాజీ సైనికులు, ఎన్సీసీ, స్కౌట్స్, విద్యార్థులు పాల్గొనేలా సమగ్ర ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమాలకు జాయింట్ కలెక్టర్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని తెలిపారు.
జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేసేలా 14 శకటాల ప్రదర్శన, ప్రభుత్వ పథకాలపై స్టాల్స్ ఏర్పాటు చేయాలని, జాతీయ సమైక్యతను ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. వేడుకల సందర్భంగా వైద్య శిబిరం, అంబులెన్స్, టెంట్లు, సిట్టింగ్, పబ్లిక్ అడ్రస్ సిస్టం ఏర్పాట్లతో పాటు ప్రతిభావంతులకు ప్రశంసా పత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు.
అదే రోజు గ్రామీణ పారిశుధ్యంపై నిర్వహించిన సమావేశంలో ఐవీఆర్ఎస్ సర్వేలో తక్కువ ఫలితాలు సాధించిన గ్రామాల్లో డోర్ టు డోర్ చెత్త సేకరణ తప్పనిసరిగా జరగాలని, అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.

