రక్షణ న్యూస్ గుంటూరు:
ఆంధ్రప్రదేశ్ తెలుగు మరియు సంస్కృత అకాడమీ చైర్మన్ శరత్ చంద్ర (ఆర్.డి. విల్సన్)కు ఆంధ్ర శ్రీ పూర్ణకుంభ పురస్కారం ప్రదానం చేశారు. గుంటూరు నగరంలోని సత్య సాయి స్పిరిట్యువల్ ట్రస్ట్ ఆవరణలో శనివారం రాత్రి ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన మూడవ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా సాహిత్య విభాగంలో ఈ పురస్కారాన్ని అందజేశారు.
ప్రముఖ గాయకుడు, ప్రపంచ తెలుగు మహాసభల ఆహ్వాన కమిటీ అధ్యక్షులు గజల్ శ్రీనివాస్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి మానవేంద్ర రాయ్, ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, టీడీపీ నాయకుడు టి.డి. జనార్దన్ చేతుల మీదుగా శరత్ చంద్రకు పురస్కారం ప్రదానం చేశారు.
సాహిత్య రంగంలో విశేష కృషి చేసిన శరత్ చంద్ర ఇప్పటివరకు 400కు పైగా కథలు, 40 నవలలు రచించారు. సమాహారం, కమ్లి, క్వీన్ పేర్లతో కథా సంకలనాలను వెలువరించారు. ఆయన రచనలకు 75కు పైగా పురస్కారాలు లభించగా, గతంలో వసుమతి మాధవ సాహితీ పురస్కారం కూడా అందుకున్నారు.
అమెరికా నుంచి అంతర్జాల వేదికగా తోటకూర ప్రసాద్ నిర్వహించిన తానా సాహితీ వేదికలో పలుమార్లు పాల్గొన్న ఆయన, ప్రభుత్వం తిరుపతిలో నిర్వహించిన ప్రపంచ తెలుగు సభల్లోనూ పాల్గొన్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్ నిర్వహించిన తొలి ప్రపంచ స్థాయి సభల్లో కథా విభాగంలో వక్తగా పాల్గొన్నారు.
పూర్ణకుంభ పురస్కారం
RELATED ARTICLES

