
రక్షణ న్యూస్, గుంటూరు
గుంటూరు నగరంలోని బృందావన్ గార్డెన్స్ మెయిన్ రోడ్ విస్తరణ పనులు నిర్దేశిత ప్రణాళిక మేరకు వేగంగా, నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని నగర పాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. ఆదివారం బృందావన్ గార్డెన్స్ మెయిన్ రోడ్ను స్వయంగా పరిశీలించిన కమిషనర్, పనుల పురోగతిపై ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులతో సమీక్షించి తగు సూచనలు చేశారు. అభివృద్ధి పనుల్లో జాప్యం జరిగితే ప్రజల రాకపోకలతో పాటు చుట్టుపక్కల నివాసితులకు ఇబ్బందులు తలెత్తుతాయని ఆయన హెచ్చరించారు. రోడ్ విస్తరణతో పాటు డ్రైనేజీ పనులు కూడా సమాంతరంగా చేపట్టాలని, విస్తరణ ప్రభావిత భవనాల తొలగింపులో ట్రాఫిక్కు, ప్రజలకు సమస్యలు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి పనిని నిర్దేశిత గడువులో పూర్తిచేసే బాధ్యత కార్యదర్శులు, అధికారులు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో డీఈఈ వెంకటరమణతో పాటు పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్, ప్రజారోగ్య శాఖ అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు