వివేకానందుని బోధనలు—
యువతకు శక్తి, దిశా నిర్దేశం
కలెక్టర్ తమీమ్ అన్సారియా
స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా మాట్లాడుతూ, “వివేకానంద జీవితం యువతకు మార్గదర్శకం” అని పేర్కొన్నారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భారత ఆధ్యాత్మిక–తాత్విక వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన విశిష్ట మహనీయుడు స్వామి వివేకానంద అని తెలిపారు. యువతలో శక్తి, ధైర్యం, ఆత్మవిశ్వాసాన్ని నింపిన ఆలోచనావేత్త అని గుర్తుచేశారు.
“మేలుకో… లక్ష్యాన్ని సాధించే వరకు ఆగవద్దు” అనే వివేకా సూక్తి ప్రతి యువకుడి జీవితానికి మార్గదర్శకమని చెప్పారు. యువతలో దేశభక్తి, సేవాభావం, నైతిక విలువలు పెంపొందాల్సిన అవసరం ఉందని, వివేకానంద బోధనలు దీనికి బలమైన పునాదిగా నిలుస్తాయని పేర్కొన్నారు.
జాతీయ యువజన దినోత్సవం నిర్వహణ, ఆయన యువతపై చూపిన దీర్ఘకాల ప్రభావానికి నిదర్శనమని కలెక్టర్ అన్నారు. యువత అంతా వివేకానంద సిద్ధాంతాలను ఆచరణలో పెట్టి దేశ నిర్మాణంలో ముందుండాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజా వలి, జడ్పీ సీఈఓ వి. జ్యోతి బసు, వివిధ శాఖల అధికారి, ఇంజనీర్లు, విభాగాధిపతులు తదితరులు పాల్గొన్నారు.!

