
హైదరాబాద్లో రోజ్గార్ మేళా:
61,000 మందికి నియామక లేఖలు
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ రోజ్గార్ మేళా కార్యక్రమంలో భాగంగా, గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ 24 జనవరి 2026న కేంద్ర ప్రభుత్వ విభాగాలు, సంస్థల్లో కొత్తగా ఎంపికైన 61,000కుపైగా అభ్యర్థులకు నియామక లేఖలను పంపిణీ చేయనున్నారు. ఉదయం 10:30 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఈ లేఖలను ప్రధాని అందజేయనున్నారు.
ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని గ్రూప్ సెంటర్, సీఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో CRPF పురుషుల క్లబ్లో 18వ విడత రోజ్గార్ మేళా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర బొగ్గు & గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అభ్యర్థులకు నియామకాల ఆఫర్ లేఖలను పంపిణీ చేయనున్నారు.
కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ సౌత్ జోన్ ఏడీజీ రవిదీప్ సింగ్ సాహి, ఐజీలు టి. విక్రమ్, ఏ. శ్రీనివాస్, డా. గణేష్ చంద్ర పాధి, డీఐజీలు ఉదయభాస్కర్ బిల్లా, ప్రకాష్ చంద్ర శ్రీవాస్తవ, అనిల్ మిన్జ్, కమాండెంట్ మోహన్దాస్ హెచ్. ఖోబ్రగాడే తదితర సీనియర్ అధికారులు పాల్గొననున్నారు. యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతోంది.