
బాపట్ల ఆత్మగౌరవం తూర్పు సత్రం..
గరుడాచలం నాయుడు ఆశయాలకు పునరుజ్జీవం
రక్షణ న్యూస్ బాపట్ల,
బాపట్ల చరిత్రలో విశిష్ట స్థానాన్ని కలిగిన తూర్పు సత్రం భూముల పరిరక్షణకు రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి ముందుకు రావాలని ఎమ్మెల్సీ డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. శనివారం బాపట్లలో జరిగిన సమావేశంలో జనసేన నాయకులు విన్నకోట సురేష్, తూర్పు సత్రం కమిటీ చైర్మన్ గుంటుపల్లి తులసి కుమారి బృందం ఎమ్మెల్సీని మర్యాదపూర్వకంగా కలిసి, సత్రం భూముల పరిరక్షణ, అభివృద్ధిపై సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ అపర దానకర్ణుడు గరుడాచలం నాయుడు త్యాగ నిరతిని కొనియాడారు. 1850లోనే తూర్పు సత్రానికి 93 ఎకరాల భూమిని దానం చేసిన ఘనచరిత్రను గుర్తు చేశారు. నేడు ఆ భూములు ఆక్రమణల బారిన పడటం బాధాకరమని పేర్కొన్నారు. తూర్పు సత్రం పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకురావడానికి తాము పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
స్థానిక ఎమ్మెల్యే నరేంద్ర వర్మ తూర్పు సత్రానికి నూతన కమిటీ ఏర్పాటు, గరుడాచలం నాయుడు విగ్రహ స్థాపనపై తీసుకున్న నిర్ణయాన్ని నేతలు స్వాగతించారు. తూర్పు సత్రం కేవలం భవనం కాదని, బాపట్ల ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని వారు పేర్కొన్నారు.